(పీపుల్ న్యూస్ – విశాఖపట్నం):మద్య నిషేధం పేరుతో మాయమాటలు చెప్పి అక్క చెల్లెమ్మలను వంచించిన జగన్మోహన్ రెడ్డికి ఈ ఎన్నికల్లో తీవ్ర పరాభవం తప్పదని భీమిలి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు అన్నారు. భీమిలి మండలం దాకమర్రి, బోడమెట్లపాలెం, తాటితూరు, మూలకుద్దు, టి.నగరంపాలెం, తాళ్లవలసలలో మంగళవారం ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలను మహిళలు నమ్మడం వల్లే 50 శాతానికి పైగా ఓట్లతో 151 అసెంబ్లీ, 22 పార్లమెంట్ స్థానాలు సాధించారన్నారు. అధికారంలోకి వచ్చాక మద్య నిషేధం హామీ గాలికి వదిలేసిన జగన్మోహన్ రెడ్డి నాసిరకం మద్యాన్ని రెండు రెట్ల ధరకి విక్రయిస్తూ పేదల ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్నారని విమర్శించారు. అధికార దాహంతో ఎన్నికల ముందు హామీలతో మహిళాలోకాన్ని నమ్మించడం వల్ల పసుపు కుంకుమ కింద చంద్రబాబు ఇచ్చిన 10 వేలను సైతం వాళ్లు పట్టించుకోలేదని అన్నారు. ముఖ్యమంత్రి హోదాలో 25 ఏళ్ల పాటు మద్యం అమ్మకాలను గ్యారంటీగా చూపించి రుణం తీసుకుని మహిళలను మోసం చేశారని చెప్పారు. నిషేధం చేయకపోతే 2024 ఎన్నికల్లో ఓటు కూడా అడగనని ప్రగల్భాలు పలికిన జగన్మోహన్ రెడ్డి ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తున్నారని నిలదీశారు.
*మెగా డీఎస్సీ మెగా మోసం*
తాను విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు మూడు సార్లు డీఎస్సీ ద్వారా ఖాళీలు భర్తీ చేశామని గంటా శ్రీనివాసరావు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా కాలయాపన చేసిన ప్రభుత్వం గడువు తీరడానికి 3 నెలల ముందు కంటి తుడుపు చర్యగా మెగా డీఎస్సీ ప్రకటించిందని, ఇది నిరుద్యోగులను వంచించడమే అని తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతుంటే యువతకు ఉద్యోగాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. కార్యక్రమంలో టిడిపి, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
More Stories
ప్రతిపక్షాలపై కక్ష సాధింపే జగన్ ఎజెండా – గంటా శ్రీనివాసరావు
ఎండాడ చర్చిలో గంటా రవితేజ
సీఎంగా జూన్ 9న చంద్రబాబు ప్రమాణస్వీకారం – రాష్ట్రంలో 160, ఉత్తరాంధ్రలో 30కి పైగా సీట్లు గెలుచుకుంటాం – అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిపై దాడి చేసి విష సంస్కృతికి తెర తీశారు – గంటా శ్రీనివాసరావు